ఆర్టీసీ కార్మికులు తమ న్యాయమైన డిమాండ్లు నెరవేర్చాలని చెప్పి గత 37 రోజులుగా
సమ్మె చేస్తున్నారు. అందులో ప్రధానమైన డిమాండ్ ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయడం. ఇది ఇక్కరోజులో జరిగే పని కాదు కాబట్టి ప్రభుత్వం ముందుగా దీనిపై చర్చలకు పిలిస్తే.. దానిపై చర్చిస్తూ..తదుపరి నిర్ణయాలు తీసుకోవచ్చు అన్నది కార్మికుల వాదన. కానీ, ప్రభుత్వం మాత్రం దానికి కట్టుబడి లేదు.
ఆర్టీసీ కార్మికులు
సమ్మె చేయడం న్యాయం కాదని చెప్పి వారిపై చర్యలు తీసుకుంది. వారిని సెల్ఫ్ డిస్మిస్ చేసినట్టు చెప్పింది.
కేసు కోర్టుకు వెళ్లడంతో కొంతమెత్తపడిన ప్రభుత్వం ఉద్యోగాల్లో చేరేందుకు డెడ్ లైన్ పెట్టింది. అంతేకాదు, ఆర్టీసీలో పనిచేయడానికి కొంతమంది ప్రైవేట్ ఉద్యోగులను తీసుకుంది. తాత్కాలికంగా ఆర్టీసీలో చేరిన ప్రైవేట్ వ్యక్తులను డ్రైవర్లు, కండక్టర్లుగా పనిచేస్తున్నారు. గతంలో ఆర్టీసీలో పనిచేసే డ్రైవర్లు, కండక్టర్లపై నిత్యం నిఘా ఉండేది. ఎప్పటి కప్పుడు చెకింగ్ చేసేవారు.
కానీ, ఇప్పుడు అలా కుదరడం లేదు. ఎందుకంటే, ఇప్పుడు ఆర్టీసీలో తాత్కాలికంగా పనిచేస్తున్నది ప్రైవేట్ వ్యక్తులు. ఇది వాళ్లకు వరంగా మారింది. చేతివాటం చూపిస్తున్నారు. అందినకాడికి దోచుకుంటున్నారు. ఖమ్మం జిల్లాలో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. ఖమ్మం డిపోలో శనివారం రాత్రి ఓ
కండక్టర్ విధులు ముగించుకొని డిపోలో సొమ్ము చెల్లించేందుకు వచ్చాడు.
అలా సొమ్ము చెల్లించేందుకు వచ్చిన సమయంలో అతని జేబులోనుంచి కొన్ని టిక్కెట్లు కిందపడ్డాయ్. వాటిని చూసిన సిబ్బంది ప్రశ్నించగా అసలు విషయం బయటపడింది. బస్సు రూట్ లో అప్పుడప్పుడు
ఆర్టీసీ టికెట్లతో పాటుగా నకిలీ టికెట్లు కూడా ఇస్తూ.. సొమ్ము చేసుకుంటున్నాడు. అలా రోజుకు పది నుంచి పదిహేను వేలరూపాయల వరకు సొమ్మును స్వాహా చేసినట్టు తెలుస్తోంది. ఈ విషయం వెలుగులోకి రాకుంటే
ఆర్టీసీ సొమ్ము ఇంకెంతగా పోయేదో. ఇలా ఎంతమంది చేస్తున్నారో ఎవరికీ తెలుసు.