దేశ రాజధాని ఢిల్లీలో దారుణమైన ఘటన చోటు చేసుకుంది. 90 సంవత్సరాల వయస్సు కల వృధ్ధుడిని దుండగులు డబ్బు కోసం కిడ్నాప్ చేసారు. 90 సంవత్సరాల వయస్సు కల క్రిషన్ కోస్లా అనే వృధ్ధుడు తన భార్యతో కలిసి సౌత్ ఢిల్లీలో నివాసం ఉంటున్నాడు. క్రిషన్ కు ఇద్దరు కుమారులు. ఇద్దరిలో ఒకరు ఢిల్లీలోనే పారిశ్రామికవేత్తగా ఉండగా మరొక కుమారుడు విదేశాల్లో ఉన్నాడు. 
 
సంవత్సరం క్రితం ఇంటి పనుల కోసం నియమించుకున్న యువకుడు ఈ కిడ్నాప్ చేసాడని సమాచారం. శనివారం సాయంత్రం రోజూ మాదిరిగానే ఆ యువకుడు క్రిషన్ కోస్లా అతని భార్యకు టీ ఇచ్చాడు. ముందుగానే కిడ్నాప్ చేయాలని ప్లాన్ చేసిన ఆ యువకుడు టీలో మత్తుమందు కలిపాడు. మత్తుమందు కలిపిన టీ తాగిన వృధ్ధ దంపతులు ఇద్దరూ స్పృహ కోల్పోయారు. ఆ తరువాత ఆ యువకుడు తన స్నేహితులైన నలుగురిని క్రిషన్ ఇంటికి పిలిచాడు. 
 
నలుగురు మిత్రులతో కలిసి యువకుడు వృధ్ధుడిని ఫ్రిజ్ లో కుక్కాడు. ఆ తరువాత ఇంట్లోని విలువైన వస్తువులు, వృధ్ధుడు ఉన్న ఫ్రిజ్ ను ఐదుగురు కలిసి తీసుకొనివెళ్ళారు. ఆ ఇంటి వాచ్ మెన్ ఫ్రిజ్ లో వృధ్ధుడు ఉన్న విషయాన్ని గుర్తించలేకపోయాడు. ఆ ఐదుగురు ఇంటిలోని పాత వస్తువుల్ని తీసుకొని వెళ్తున్నారేమోనని వాచ్ మెన్ భావించాడు. 
 
క్రిషన్ భార్య మరుసటిరోజు ఉదయం మెలుకువ వచ్చిన సమయానికి భర్తతో పాటు ఇంట్లో పని చేసే యువకుడు కనిపించలేదు. క్రిషన్ భార్య భర్త కనిపించకపోవటంతో పోలీసులకు ఈ విషయం గురించి ఫిర్యాదు చేసింది. క్రిషన్ ను కేవలం డబ్బు కోసం కిడ్నాప్ చేసారా లేక కిడ్నాప్ చేయటానికి ఇతర కారణాలేమైనా ఉన్నాయా అనే విషయం తెలియాల్సి ఉంది. పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. 
 



మరింత సమాచారం తెలుసుకోండి: